2002 నాటి హత్యాకాండ కేసులో మోదీకి క్లీన్ చిట్

  • మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన నానావతి కమిషన్
  • ఐదేళ్ల క్రితమే తుది నివేదికను సమర్పించిన కమిషన్
  • ఈ రోజు అసెంబ్లీ ముందుకు వచ్చిన నివేదిక
2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి ఊరట లభించింది. ఆయనకు నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లతో అప్పటి రాష్ట్ర మంత్రులెవరికీ సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఘటన జరిగిన సమయంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. నానావతి కమిషన్ రిపోర్టును ఈరోజు గుజరాత్ అసెంబ్లీకి సమర్పించారు. ఐదేళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిపోర్టును నానావతి కమిషన్ సమర్పించింది. రిటైర్ట్ జస్టిస్ లు నానావతి, అక్షయ్ మెహతాలు ఈ ఘటనకు సంబంధించిన తుది నివేదికను 2014లో అప్పటి ఆనందిబెన్ ప్రభుత్వానికి సమర్పించారు.

2002 ఫిబ్రవరి 27న గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలుకు కొందరు దుండగులు నిప్పంటించడంతో 59 మంది హిందువులు చనిపోయారు. దీంతో, మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. వీరిలో అత్యధికులు ముస్లింలు. ఈ అల్లర్లపై విచారణకు కమిషన్ ను 2002లోనే అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ వేశారు.

మూడు రోజుల పాటు కొనసాగిన హింసను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని కమిషన్ తన నివేదికలో అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో గుంపులను పోలీసులు అడ్డుకోలేకపోయారని వెల్లడించింది. అల్లర్లను నియంత్రించలేకపోయిన పోలీసు అధికారులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సూచించింది.
Go Back to Shorts
Narendra Modi
2002 Gujarat Riots
Nanavati Commission
BJP

More Telugu News